కేటీఆర్ రోడ్ షో తో మిర్యాలగూడ గులాబి మయం
భాస్కర్ రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిర్యాలగూడ జిల్లా చేస్తాం.. కేటీఆర్
రథసారథి, మిర్యాలగూడ:
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ సోమవారం మిర్యాలగూడ పట్టణంలో రోడ్ షో చేపట్టారు. కేటీఆర్ రాకతో మిర్యాలగూడ పట్టణం మొత్తం గులాబీ మయంగా మారింది. స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద నుంచి రాజీవ్ చౌక్ వరకు కేటీఆర్ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది అన్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే కల్లి బొల్లి కబుర్లు నమ్మి మోసపోవద్దు అన్నారు. వారు అధికారంలోకి వస్తే రైతుబంధు కట్,రైతు భీమా కట్, 24 గంటల కరెంటు కట్ అవుతుందన్నారు. కెసిఆర్ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. వాటన్నిటిని కొనసాగించాలంటే కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా తిరిగి భాస్కర్ రావు ను గెలిపిస్తే ఈసారి జిల్లాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడను జిల్లా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. నిరంతరం ప్రజలందరి కష్టసుఖాలను తెలుసుకొని పని చేస్తున్న ఇక్కడి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోడ్ షో లో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ,రైతుబందు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.