చెస్ చాంపియన్ షిప్ విజేతకు మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ సన్మానం
రథ సారథి, మిర్యాలగూడ:
సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్- 15 చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన ఎండి ఫెరోజ్ కుమారుడు ఎండి ఆబిద్ ను మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆబిద్ కు పూలమాలలు వేసి శాలువా కప్పి సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ తన మిత్రుడు, సామాజిక సేవకుడు, నటుడు , నిర్మాత మూసా అలీ ఖాన్ మనవడు ఆబిద్
చిన్ననాటి నుంచి చెస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అనేక పోటీలలో విజేతగా నిలుస్తూ, మిర్యాలగూడ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేస్తున్నాడని ప్రశంసించారు. తాజాగా మూడు జిల్లాల పరిధిలో నిర్వహించిన ఛాంపియన్షిప్ 2023 పోటీలలో ట్రోఫీని కైవసం చేసుకుని విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో మిర్యాలగూడ పేరును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఆబిద్ ను ఇంతలా తీర్చిదిద్దిన మూసా అలీ ఖాన్ తో పాటు తల్లిదండ్రులు రూబియా ఫెరోజ్, ఎండి ఫెరోజ్ లను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.