మిర్యాలగూడ జిల్లాకు కృషి చేసే వారికే మద్దతు
రథ సారథి,మిర్యాలగూడ:
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసే రాజకీయ పార్టీలకే రానున్న ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలుపుతారని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళి యాదవ్, వజ్రగిరి అంజయ్యలు అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో జిల్లా సాధన కోసం మళ్లీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామని పేర్కొంటూ పలువురు నాయకులు, నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. గత ఏడు నెలల నుండి జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని మరో కొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు రానున్న దృష్ట్యా జిల్లా ఏర్పాటు కోసం ఆయా పార్టీల మేనిఫెస్టోలలో తీర్మానం చేసే పార్టీలకు ప్రజలు మద్దతు తెలుపుతారని తెలిపారు. జిల్లా ఏర్పాటు విషయమై మిర్యాలగూడ,నాగార్జునసాగర్,హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు జిల్లా ఏర్పాటు ఆవశ్యతను పేర్కొంటూ వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. నల్గొండ పార్లమెంటు సభ్యులతో పాటు శాసనమండలి చైర్మన్ కు వినతి పత్రాలు ఇచ్చామని జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ప్రజలందరి కోరిక అని నెరవేర్చాల్సిన బాధ్యత రాజకీయపక్షాలకు ఉందన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసి ప్రజలలో తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటుతో అనేక సౌకర్యాలు ఏర్పడడంతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పడతయని తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఏర్పాటు విషయమే రాజకీయ పక్షాలు స్పందించి ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు వెంకన్న, గురువయ్య, కిషన్, దాసరి వంశీ,కిరణ్,నవీన్ నాయక్,అంజయ్య, సాయి నాయుడు హరి నాయుడు,మధు బాబు, నీలకంఠ నాయక్ తదితరులు పాల్గొన్నారు.