రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధం: రఘువీర్ రెడ్డి
రథ సారథి, దామరచర్ల:(రామకృష్ణారావు):
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో జిల్లాలో ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. దామరచర్ల మండలంలోని వాడపల్లి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం మహా రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిందన్నారు . ఆ సర్వే ఆధారంగా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు . బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని ఆయన చెప్పారు. వ్యవసాయానికి సక్రమంగా కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు . వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పనున్నట్లు ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ , నాయకులు చిరుమర్రి కృష్ణయ్య ,పొదిల శ్రీనివాస్, రాజా రమేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎల్వి సత్యనారాయణ ,సలీం, కాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.