ఎరుపెక్కిన మిర్యాలగూడ…!
అశేష జన వాహినితో ర్యాలీ అనంతరం”రంగన్న” నామినేషన్
రథసారథి-మిర్యాలగూడ
మిర్యాలగూడ సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి నామినేషన్ సందర్భంగా శుక్రవారం ఎర్రదండు కదిలింది. నియోజవర్గ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఎర్ర జెండా నినాదాలు చేశారు. హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి శకుంతల థియేటర్, ఆర్టిసి బస్టాండ్, రాజీవ్ చౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. సుమారు కిలోమీటర్ మేరకు ర్యాలీ సాగింది. ర్యాలీ జరుగుతున్న సమయంలో కార్మికులు, హమాలీలు, పూల, పండ్ల వ్యాపారులు ఎదురెళ్లి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.పండ్ల వ్యాపారి మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో గజమాలవేసి అభిమానాన్ని చాటుకున్నారు.ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మధు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జూలకంటి రంగారెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. దేశాన్ని దోచుకు తింటున్న మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడిందని మతోన్మాద బిజెపిని ఓడించడమే లక్ష్యంగా మిత్రపక్షాలు పనిచేస్తున్నాయన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రభుత్వ సొమ్మును ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్ కు ఎన్నికల్లో ఓడించే బుద్ధి చెప్పాలన్నారు. బిజెపితో లోపాయి కారికంగా ఒప్పందం ఉండడం వల్లనే కేసీఆర్ వామపక్షాలతో స్నేహాన్ని వదులుకున్నాడని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో అనేక అబద్ధాలు చెప్పి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేశాడని ఈసారి ప్రజలు కేసీఆర్ను కుర్చీ దింపేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరన్నారు. పేదల పక్షాన నిరంతరం రాజీలేని పోరాటాలు చేసేది జూలకంటి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం విశేష కృషి చేశారని చెప్పారు.ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే మోసగాళ్ల మాటలను నమ్మొద్దని సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మిర్యాలగూడలో ధన బలం పోరాడే బలం మధ్య ఎన్నికల జరుగుతున్నాయని ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. దీనికి తోడు మహిళా డిగ్రీ కళాశాల మంజారుకు పాటుపడతారన్నారు. ఇప్పటివరకు మిర్యాలగూడకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశానని భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మిర్యాలగూడ గౌరవాన్ని పెంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వి రమ, నారి ఐలయ్య, డబ్బి కార్ మల్లేష్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిఐటియు రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, పాదురి శశిధర్ రెడ్డి,రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, వరలక్ష్మి, వినోద్ నాయక్, సీతారాములు, గోవర్ధన, రొండి శ్రీనివాస్, బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.