వీడిన ఉత్కంఠత… బత్తుల లక్ష్మారెడ్డికే కాంగ్రెస్ టికెట్..
రసవత్తరంలో ‘మిర్యాలగూడ’అసెంబ్లీ ఎన్నికలు
రథసారథి మిర్యాలగూడ:
గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ఏర్పడ్డ సుదీర్ఘ ఉత్కంఠత కు ఎట్టకేలకు తెరపడింది. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డిని ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి వెలువడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాలో మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానానికి బత్తుల లక్ష్మారెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో కాంగ్రెస్ కేడర్లో ఒక్కసారిగా ఉత్తేజం వచ్చింది. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు బాణాసంచాలు పేల్చి ఆనందం వ్యక్తపరిచారు. గురువారం ఉదయం అశేష జనవాహిని మధ్య ,వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన బత్తుల లక్ష్మారెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ చివరి జాబితాలో మిర్యాలగూడ స్థానం బత్తుల లక్ష్మారెడ్డికి కేటాయింప బడటంతో మిర్యాలగూడ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.